Tuesday, March 18, 2008

సంఘర్షణ – మనశ్శాంతి

ఈమధ్య ఈవిషయంపై రాయాలనిపించింది. ఈ క్రింద రాసినవిషయాల్లో ఫలానాది యూజీ దగ్గర్నించి నేర్చుకున్నదీ, ఫలానాది నాసొంత ఊహా అని విభజించి చెప్పలేను. అలాంటి విభేదం నా మనసులోనే లేదు. ఏదో నాకు తోచింది రాస్తున్నాను.

* * *


మనకి ఊహ తెలిసినప్పటినించీ పరిపాటిగా ఉన్న అనుభవం ఇది: మనకు కావాల్సింది ఏదైన మనకి దొరకనప్పుడు మన మనసు నొచ్చుకుంటుంది. ఒక్కొక్కప్పుడు అది లేకపోతే మనకి జీవితంలోనే మరి సుఖం అనేదే ఉండదనిపిస్తుంది. అయితే మనం ఒక్కొక్కప్పుడు అనేక విషయాల్ని కోరుకోవడం కూడా కద్దు. మనం కోరుకున్నదాన్ని సంపాదించుకోవడంలో ఎలాంటి విఘ్నం కలిగినా దాన్ని సహించలేం సరికదా, ఆ విఘ్నాన్ని మన దోవనించి తొలగించడానికి మనం సర్వవిధాలా ప్రయత్నిస్తాం. మన తోవకి అడ్డు వచ్చినవార్ని శతృవులుగా భావించి, వారిని పందెంలో ఓడించడానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో విఫలమైనా, మరేవిధంగానూ మనకి కావాల్సింది మనకి రాకపోయినా, మన మనసు వ్యాకులమై పోతుంది. మనం ఉదాసీనుల మవుతాం.

మన సంఘర్షణ ఇతరులతోనేకాక మనలో మనకే చాలాభాగం ఉంటుంది: ఒకటే విషయం కోరుకుంటే అంతఃసంఘర్షణ ఉండదు. రెండు విషయాల్ని కోరుకుంటే వాటిల్లో ఏది ముఖ్యమో నిర్ణయించుకోలేని సందేహ స్థితి అంతస్సంఘర్షణకి ఒక ఉదాహరణ. అంతస్సంఘర్షణకి చాలా రూపాలున్నాయి. ఉదాహరణకి భయం. దేన్ని గురించైనా భయపడుతున్నామనుకోండి: భయం రాంగానే దాని విషయమైన ఎరికకూడా దాంతోనే ఏర్పడుతుంది. ఆ ఎరికలో ఆ భయం లేకుండా ఉండాలనీ, దాన్నినిరోధించాలనే సంకల్పంకూడా ఇమిడి ఉంటుంది. అలా దాన్ని నిరోధించే ప్రయత్నం ఉన్నంత వరకూ ఆ భయం కొనసాగుతూనే ఉంటుంది.
మరో ఉదాహరణ: సందిగ్దత

రెండు విషయాల్ని ఒకేసారి కావాలనుకున్నప్పుడూ, అది కావాలా అక్కర్లేదా అనే సందిగ్ధంలో పడ్డప్పుడూ కూడా మన మనసులో సంఘర్షణ ఏర్పడుతుంది. ఇదమిత్థంగా తేలుచుకోలేక సతమతమౌతాం.

కోపం, అవమాన భావం, పగ, ద్వేషం, స్పర్ధ లాంటి మనోభావాలుకూడా అంతఃస్సంఘర్షణని సూచిస్తాయి. మరొకడు మనవిషయంలో ఏదో అపరాధం చేశాడని అనుకుంటే అతని మీద మనకు కోపం రావడం సహజం. ఆ కోపాన్ని వెంటనే వెళ్ళబోసుకుని అతన్ని తిట్టో కొట్టో మన దోవన మనం పోతే కోపంతో సమస్య ఉండదు. అయితే మనం అతని అపరాధాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుని, ఆ కోపానికి జీవం పోసి, దాన్ని నిలుపుకుంటాం. ఆ అపరాధాన్ని గురించిన ప్రతి స్మృతీ ఆ కోపానికి నీరు పోసి పెంచుతుంది. అప్పుడు మనం ఆ కోపాన్ని సమర్ధించుకోవడమో, లేక తప్పుచేశామని మనసులో నొచ్చుకోవడమో చేస్తాం. అప్పుడు మనతో మనకో, మనకూ ఇతరులకూ మద్యనో పోరాటమూ సంఘర్షణా ఏర్పడుతాయి. లోతుగా అలోచిస్తే ఇతరులతో మనం పడే సంఘర్షణకూడా మన మనసులో ఒక ప్రతిరూపాన్ని ఏర్పరచుకుని అంతఃసంఘర్షణగా తయారవుతుంది. దానికి కారణం మనతో మనం చేసుకునే సంభాషణే. ఆ సంభాషణ జరిపేది మన శతృవుతో ప్రత్యక్షంగా కాకుండా, మన మనసులో మనం ఏర్పరచుకున్న శతృవు ప్రతిరూపంతో కనక.

మనను బాధించే మానసిక సమస్యలన్నింటినీ ఈ విధంగా సంఘర్షణ రూపాంతరాలుగా మనం ఊహించవచ్చు.

ఇప్పుడు ఇలాంటి సమస్యలకి పరిష్కారం ఏమిటనే ప్రశ్న వస్తుంది: ఈ ప్రశ్నకి సమాధానం అంత తేలికగా ఇవ్వ గలిగేది కాదు. కొన్ని ఘర్షణలకి పూర్తి పరిష్కారం కావాలంటే మనం కట్టుకున్న మానసిక నిర్మాణాల్ని పూర్తిగా ప్రశ్నించి తొలిచెయ్యాలి.

ఉదాహరణకి ఆ కోపాన్నే తీసుకోండి: ఆ కోపం వస్తేనేం అని దాన్ని తుడిచేసుకుని సాగి పోతే ఆ కోపం అనే సమస్య ఉండదు. ఆ క్షణంలో ఆ కోపం వచ్చిన మనిషిని మనం క్షమించి వదిలేసినట్టే. మనసు ఇంకా నొచ్చుకుంటూ ఉంటే మనల్ని మనం క్షమించుకోగలిగితే ఆ సమస్య అప్పటితో తీరిపోతుంది. అలాగే, ఇతరులు మనం కోప్పడ్డామని మనల్ని ఆక్షేపిస్తారేమోనన్న భయం ఉన్నా, అవతలి మనిషిని తిట్టినందుకో, కొట్టినందుకో, అవమానించినందుకో రా్వొచ్చే పలితాల గురించైనా భయం ఉన్నా, మనకు ఆ సంఘర్షణనించి విముక్తి కలదు. అందుకని ఆ భయాల్నించి దూరమవాలి.

ఇలాంటి తోవలు మనకు తెలిసినా, ఆ తోవల్ని తొక్కే ప్రయత్నంలో మనతో మనం పోరాడుకోవడం తప్పదు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే, మనం ఆకోపం పోవాలని గానీ, ఆ సమస్యనించి దూరమవాలనిగానీ ప్రయత్నం చేస్తున్నంత కాలం ఆ సమస్య పోకపోవడమే కాక, ఆ సమస్య మరింత దృఢతర మవుతుంది. ఉదాహరణకి భయాన్ని చూడండి. ఆ భయం ఉండకూడదనుకొని మనం చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థం అవటమే కాక, మనం ప్రయత్నించినకొద్దీ ఆ భయం మరింత విపరీతమవుతుంది.

కొన్నిసమయాల్లో కోపాన్ని మనసులో అణచిపెట్టే ప్రయత్నం చేస్తాం. కాని, అలా అణచిపెట్టిన కోపం మరో సందర్భంలో మరింత ఉద్ధృతంగా తలెత్తుతుంది. భార్యమీద కోపాన్ని దిగమింగుకుంటే ఆఫీసులోని క్రింది ఉద్యోగులనో, ప్యూన్న్నో దానికి గురిచేస్తాం.

మనలో జరిగే ఈ నిరంతర పోరాటాన్ని ద్వంద్వం అని అందాం. మనసులో జరిగే ఏ సంఘర్షణనించైనా విముక్తి చెందాలనే ప్రయత్నంలో ఈ ద్వంద్వం ఇమిడి ఉంది.'నేనూ ' ’నా భయం' -- వీటి మధ్య ద్వంద్వం. 'నాకు భయం వేస్తోంది, ఆ భయాన్ని నేను ఏదో విధంగా లేకుండా చేసుకోవాలీ అనేదే ద్వంద్వం. నాకూ నేను వీక్షించే విషయలకీ ఇలాంటి విభాగం ఉన్నంతకాలం నాకు అశాంతి, మనో సంక్షోభం తప్పదు. మనతో మనం చేసే పోరాటంలో మనకి ఎప్పటికీ విజయం చేకూరదు: దానికి చిన్న సూక్ష్మమైన కారణం ఏమిటంటే పోట్లాడే వ్యక్తీ, పోట్లాడే శతృవూ ఇద్దరం మనమే కావడం వల్ల. ఈ విషయాన్నిగురించి వివరంగా మరోచోట రాస్తాను.

ఈ సంఘర్షణ అనే సమస్యని మూలంలో పరిష్కరించాలంటే ఆవిభాగం నించి విముక్తులం కావాలి. అయితే మనం ఎలాంటి ప్రయత్నం చేసినా ఆ విభాగానికి దోహదం చేసిన వాళ్ళమే అవుతాం. ఆ ప్రయత్నం ఏదో విధంగా సమసి పోవాలీ అంటే ఆ సమస్యకి మనం పూర్తిగా తలవంచి శరణాగతులమవ్వాలి. అంటే ఆసమస్య ఉన్నా లేకపోయినా ఫరవా లేదనే మనో స్థితికి రావాలి. అలా వచ్చినప్పుడు ఆ సమస్య దానంతట అదే పోతుంది. ఉదాహరణకి మన కోపమూ, భయమే కాకుండా, ఎవరి మీద కోపముందో వారిని క్షమించి వదిలేయడమూ, దేన్ని గురించి భయపడుతున్నామో దానికి దూరమవడానికి ప్రయత్నించకుండా, మరింత దగ్గరగా చేరి దానిలో ఐక్యమయి పోవడమూ జరుగుతుంది. అలా జరిగితే భయానికి మన మనసులో చోటే ఉండదు.

సాధారణంగా మనం సమస్యలని ఇంతా లోతుగా చూడం. ఏదోవిధంగా గట్టెక్కి ఒడ్డునపడదామనే ధ్యాసేగానీ, ఒక సమస్యని పూర్తిగా అర్ధం చేసుకునేంత ఆసక్తి మనకి ఉండదు. మన ఆతృతంతా ఈ క్షణంలో ఎలా నెగ్గుదామా, ప్రస్తుతం నాకుకావాల్సింది ఎలా వస్తుందా, ఈ క్షణంలో ఈ భయాన్ని ఎలా పోగొట్టుకొవాలా అనే. ఆందుకనే మనం సమస్యల్ని పూర్తిగా పరిష్కరించకోక శాశ్వతంగా అశాంతితో ఉండి పోతాం.

2 Comments:

Blogger మాగంటి వంశీ మోహన్ said...

మా తాతగారు కాశీభట్ట రాఘవయ్య గారు చెప్పిన ఈ క్రింది మాటలు , "సాధారణంగా మనం సమస్యలని లోతుగా చూడం. ఏదోవిధంగా గట్టెక్కి ఒడ్డునపడదామనే ధ్యాసేగానీ, ఒక సమస్యని పూర్తిగా అర్ధం చేసుకునేంత ఆసక్తి మనకి ఉండదు. మన ఆతృతంతా ఈ క్షణంలో ఎలా నెగ్గుదామా, ప్రస్తుతం నాకుకావాల్సింది ఎలా వస్తుందా, ఈ క్షణంలో ఈ భయాన్ని ఎలా పోగొట్టుకొవాలా అనేదే మన లక్ష్యం. ఆందుకనే మనం సమస్యల్ని పూర్తిగా పరిష్కరించకోక శాశ్వతంగా అశాంతితో ఉండి పోతాం." అచ్చు పొల్లుపోకుండా మళ్ళీ మీ టపాలో చూస్తున్నా

March 19, 2008 at 8:56 AM  
Blogger చిన్నమయ్య said...

వేరు అనుకోవడమే, భయానికైనా, మరేదైనా ఘర్షణకైనా నాంది.

మీ వ్యాసం ఆసక్తికరంగా వుంది.

March 19, 2008 at 12:57 PM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home