Thursday, February 21, 2008

4. యూజీ:


మీలో కొంతమందికి యూ.జీ. కృష్ణమూర్తిగారంటే తెలిసి ఉండదు. గురువని అనిపించుకోవడం ఆయనకు ఇష్టం లేకపోయినా, ఆయన నాకు ఉత్తమోత్తములైన గురుసమానులు. ఆయన పోయిన ఏడాది మార్చి 22వ తారీకున ఇటలీలో, వలక్రోసియా అనే ఊర్లో మరణించారు. ఆయనతో నా తొలి పరిచయం 1981లో జరిగి 25 సంవత్సరాల సాంగత్యంతో ముగిసింది.

ముందర ఆయన్నిగురించి కొంత ప్రస్తావన చేస్తాను:

ఆయన ఒక మహాజ్ఞాని. ఆయనతో బాగా పరిచయం ఉంటేనేగాని ఆయన స్వభావం పూర్తిగా తెలియదు. అయినా, ఎంతో కాలం సన్నిహితులుగా ఉన్నవారికికూడా అంతుపట్టని అజ్ఞాత వ్యక్తి ఆయన. ఆయన్ని అందరూ యూజీ అని సంబోధిస్తారు.

పుట్టడం గుడివాడలో, ఇంటర్మీడియట్ వరకూ చదవడం మచిలీపట్నంలో. ఆయన పుట్టిన వారం రోజుల్లోనే తల్లి చనిపోవడంచేత మాతామహులు ఆయన్ని పెంచుకున్నారు. ఆయన తాతగారు ధనికులైన ప్లీడరు, ప్రముఖ దివ్యజ్ఞాన సమాజస్తులు. పెంపకం అధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. మద్రాసు యూనివర్సిటీలో ఫిలాసఫీ ఆనర్సు చదివి చదువు పూర్తి కాకముందే విరమించారు. తాతగారి కారణంగా దివ్యజ్ఞాన సమాజ నాయకులు జార్జ్, రుక్మిణీ అరండేల్,జినరాజదాస, అనీ బెసెంట్, లెడ్బీటర్ మొదలైన వారితోనూ, తరవాత జిడ్డు కృష్ణమూర్తిగారితోనూ పరిచయమయ్యింది. దివ్యజ్ఞానసమాజంలో సెక్రటరీగానూ, అంతర్జాతీయ ఉపన్యాసకులుగానూ కొన్నేళ్ళు పనిచేసి విరమించుకున్నారు..సుమారు ఏడేళ్ళు, ప్రతి వేసంకాలమూ హిమాలయా పర్వత ప్రాంతాన ఋషీకేశ్ లో ఒక గుహలో నివసిస్తూ శివానందస్వామిగారు శిష్యుడిగా యోగాభ్యాసం చేశారు. అప్పుడూ, తరవాతాకూడా అయనకి ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు కలిగినా, అవి పూర్తి పరిణామం తీసుకురాలేని స్థితులేనని వాటిమీద వ్యామోహ పడలేదు. ఒకసారి, ఒకస్వామివారి ప్రోత్సాహంతో శ్రీ రమణమహర్షి దర్శనం చేసుకుని, ఆయన్ని కొన్ని ప్రశ్నలుకూడా వేశారు. రమణమహర్షి ఇచ్చిన సమధానాలుకూడా ఆయనకి తృప్తి కలిగించలేదు.

కృష్ణాజీ (జిడ్డు కృష్ణమూర్తి) యూజీ మీద ఎందుకనో చాలా శ్రద్ధ చూపించారు. ఆయనతో రెండునెలల తరబడి ప్రతిరోజూ సంభాషణలు చేశారు. అయినా వారిద్దరిమధ్యా అభిప్రాయభేదాలు రావడంవల్ల యూజీ తమ దోవ తాము చూచుకున్నారు. పోలియో వ్యాధిగ్రస్తుడైన కొడుకుకు దేహ చికిత్స కోసం తన ఆస్తిపాస్తులన్నీ వెచ్చించి భార్య కుసుమగారితోసహా అమెరికాలో షికాగోలోనూ, డిట్రాయిట్ ఉన్నారు. కొన్నాళ్ళకి తానిచ్చే ఉపన్యాసాలమీద తనకే విశ్వాసంలేక, ఆ పనిని మానుకుని, అమెరికాలో ఉండడానికి ఇష్టంలేని భార్యను, కొడుకుతో సహా ఇండియాకి పంపేసి, తను ఇంగ్లండులో దారం తెగిన గాలిపటంలాగా తిరిగారు. జేబులో డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. బతుకుతెరువు కశ్టమైపోయింది. అప్పుడు కొంతకాలం లండన్లో రామకృష్ణా మిషన్లో అతిధిగా ఉండి వారి వివేకానంద శతాబ్ది సంచికని తయారుచేసే ప్రయత్నంలో సంపాదక సహాయంచేశారు. అక్కడకూడా ఉండడం ఆయన సహించలేకపోయి, తనదగ్గరున్న ఫస్ట్ క్లాసు టిక్కెట్టుని అమ్ముకొని వచ్చిన డబ్బుతో పారిస్ చేరుకొని రెణ్ణెల్లుండి, హోటలు అద్దె ఇవ్వడానికి డబ్బులేక, స్విట్జర్లండులో బాంకులో ఉన్న తన డబ్బు తీసుకోవడానికి జూరిక్ వెళ్ళబోయి పొరబాటున జెనీవాకు చేరుకున్నారు. నిస్సహాయంగా ఉన్న తనని ఇండియాకి పంపించమని ఇండియన్ కాన్సలేటు వారిని కోరారు. ఆపని జరగకపోయినా, ఆ కాన్సలేటులోనే పనిచేస్తూన్న వాలంటైన్ డి కార్వెన్ అనే ఆమెతో పరిచయమై, ఆమె ఆయనను ఆదరిస్తానని తన అండలోకి తీసుకుంది. అప్పటినించీ వారిద్దరూ సహచరులూ, సహయాత్రికులూ అయ్యరు. తరవాత ఆమెకున్న ఆస్తిపాస్తుల్నన్నిటినీ అమ్ముకుని, ఆయనతోసహా సానెన్ అనే చిన్న వూర్లో నివాసం మొదలెట్టారు. అది 1967 వ సంవత్సరం. ఆయనకు 49 ఏళ్ళ వయస్సు. అంతవరకూ ఆయన జీవితమంతా ఆధ్యాతిమిక అన్వేషణతోనే గడిచిపోయింది. అయితే బుద్ధుడూ, క్రైస్తూ లాంటివారున్న ఆస్థితి ఏమిటా అనే ప్రశ్నకు ఆయనకు అప్పటివరకూ సమాధానం దొరకలేదు.

అదేసమయంలో కృష్ణాజీ సానెన్లో ఉపన్యాసాలిస్తూంటే, ఒకరోజు ఆయన వెళ్ళి విన్నారు. కృష్ణమూర్తి గారు ఆలోచనారహిత మనస్థినిగురించి ప్రస్తావించారు. అప్పుడు యూజీకి తోచింది ఆయన వర్ణించేది తాను ఉన్న స్థితినేనని. అక్కడినించి ఇంటికి తిరిగి వస్తూ, ఒక బెంచీ మీద కూర్చున్నారు, చుట్టూ ఉన్న ఏడు కొండల లోయల సమక్షంలో. అప్పుడు తనను ఇన్నేళ్ళగా పట్టి బాధిస్తున్న ప్రశ్న, మరొక ప్రశ్నగా మారింది: తానిప్పుడున్న స్థితి ఆస్థితేనని తనకెలా తెలుసునని. తనకి పూర్వం ఉన్న జ్ఞానం ద్వారా తప్ప ఆ విషయం తెలుసుకునే సాధనం వేరే ఏమీ లేదని గ్రహింపు వచ్చి, ఆ ప్రశ్నకూడా క్రమేణా అంతర్ధానమైంది. ఇంటికి వెళ్ళి పక్కమీద పడుకున్నప్పుడు మరణసమానమైన ఒక స్థితిలో పడిపోయి, తెలివిపోయి ఒక 45 నిమిషాలపాటు, ఊపిరీ గుండే ఆగిపోయి, ఒళ్ళు చల్లబడి పోయిన పరిస్థితి ఏర్పడింది. డగ్లస్ అనే ఒక స్నేహితుడు ఎందుకో ఫోనులో పిలెస్తే వాలంటైను ఫోనందుకొని యూజిని పిలిస్తే అప్పుడు ఆయనకు మళ్ళీ జీవం వచ్చింది. ఆనాటినించి, 'విపత్తు(calamity)' అని ఆయన అనే స్థితిలో పడిపోవడం ఆయనకు పరిపాటైపోయింది.

తరవాతి రోజుల్లో ఆయన ప్రత్యేకంగా వేరే బోధ అంటూ లేకుండా తానున్న స్థితినే వివరిస్తూ మాట్లాడేవారు. ఆయనని కలిసేవారిలో గాఢంగా పేరుకుపోయున్న నమ్మకాల్ని ప్రశ్నించి సమూలంగా ధ్వంసం చేయడమే ఆయన కార్యక్రమం. వాటిస్థానం లో ఉంచుకోడానికి మరే నమ్మకాల్నీ ఉపదేశించకపోవడమే ఆయనబోధనలో విశిష్టత. మీకు ఏ నమ్మకాలూ అవసరంలేదంటారు. ఏ ఆధారం లేకుండా నిలబడగలిగితే, అప్పుడే ఆ 'సహజ స్థితి ' కలగడానికి ఏమైనా సావకాశం ఉంటుందని ఆయన అంటారు.

యూజీ జీవిత చరిత్ర మీరు తెలుగులో ఈ క్రింది పుస్తకంలో చదువుకోవచ్చు:

మహేశ్ భట్ట్ రాసిన U.G.Krishnamurti -- A Life కి కొర్లిమర్ల చంద్రశేఖర్ చెసిన తెలుగు అనువాదం, యూజీ కృష్ణమూర్తి -- ఒక జీవితకథ అనే పుస్తకాన్ని 1994 లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు.

యూజీని గురించిన ఉపోద్ఘాతం ఇంతటితో ముగిస్తాను. వచ్చేసారి యూజీతో నా తొలి పరిచయంగురించి రాస్తాను.

3 Comments:

Blogger మాగంటి వంశీ మోహన్ said...

యూజీ గారి గురించి వినటమే కానీ ఇంతవరకు పెద్దగా తెలుసుకున్నది లేదు. అలా అనటం కన్నా, నిజం చెప్పాలి అంటే ఆసక్తి కలగలేదు, కొద్దిగా ఆసక్తి కలిగినా ఇతర పనుల వల్ల తెలుసుకోవటానికి ప్రయత్నించలేదు అని చెప్పవచ్చేమో. ఆయన వివరాల గురించి రాసే మీ టపాల కోసం ఎదురు చూస్తూ

వంశీ

February 21, 2008 at 3:06 PM  
Anonymous Anonymous said...

Hello Narayan Moorty gaaru,

My name is Bhargavi. While i am reading about UG gaaru i read something about Chalam, Sowris and Narthaki. I would like to know about the Chalam, Sowris and Narthaki and others. If you know anything, please tell me. I am very eager to know........
Thank You very much.

April 16, 2008 at 9:56 AM  
Blogger Narayana Moorty said...

భార్గవి గారూ:

ఈ బ్లాగులో చలం మీద ఒక అధ్యాయం ఉంది, చూశారా?
మీకు వివరాలు కావాలంటే ప్రత్యేకమైన ప్రశ్నలతో నాకు ఈ క్రింది అడ్రసుకు ఈ-మెయిల్
రాయండి:

moorty@pacbell.net

April 16, 2008 at 10:59 AM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home